ఇంఫాల్, జూలై 2: మణిపూర్లో రెండు నెలలుగా జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చురాచాంద్పుర్ జిల్లాలోని లంగ్జా, చింగ్లాంగ్మే గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనను ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) ఖండించింది. మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. మరోవైపు బిష్ణుపూర్ జిల్లాలో ఆదివారం గుర్తుతెలియని మిలిటెంట్ జరిపిన కాల్పుల్లో ఖోయిజుమంతబి గ్రామంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బంకర్కు కాపలాగా ఉన్న ఇద్దరు వాలంటీర్లు చనిపోయారు.
అల్లర్ల వెనుక చైనా హస్తం!
రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం తాజాగా కొత్త రాగాన్ని అందుకున్నది. మణిపూర్ అల్లర్ల వెనుక విదేశీ హస్తం ఉందంటూ ఆ రాష్ట్ర సీఎం బీరేన్సింగ్ ఆరోపించారు. ‘ముందస్తు ప్రణాళిక ప్రకారమే రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి. చైనా రాష్ర్టానికి సమీపంలోనే ఉన్నది. కుకీ సోదరులతో ఫోన్లో మాట్లాడాను. క్షమించి వదిలేద్దామని వారితో చెప్పాను’ అని సీఎం తెలిపారు.