గువాహటి, జనవరి 1: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. తౌబాల్ జిల్లాల్లోని లిలోంగ్ ఏరియాలో సోమవారం గుర్తుతెలియని కొందరు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత లోయలోని తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
కొందరు వ్యక్తులు ఆయుధాలతో వచ్చారని స్థానికులు పేర్కొన్నారు. తాజా హింసను ఖండించిన సీఎం బీరేన్ సింగ్.. ప్రజలు శాంతి పాటించాలని పిలుపునిచ్చారు. తాజా ఘటన నేపథ్యంలో ఆయన మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం మణిపూర్ సరిహద్దు పట్టణమైన మోరేలో అనుమానిత తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.