చెన్నై: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. రామనాథపురం లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అన్నాడీఎంకే పార్టీ జెండా, లెటర్హెడ్ను నిలబెట్టుకునేందుకు హైకోర్టును ఆశ్రయించగా, ఆ కేసులో ఓడిపోయిన పన్నీర్ సెల్వం బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు.
39 ఎంపీ స్థానాలకుగాను 16 సీట్లు కోరగా, కేవలం ఒక్క స్థానం ఇవ్వడానికి బీజేపీ అంగీకరించింది. ముస్లింలు ఎక్కువగా ఉన్న రామనాథపురం నుంచి పోటీ చేయాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. రామనాథపురంలో 2019 ఎన్నికల్లో డీఎంకే మద్దతుతో ఐయూఎంఎల్ అభ్యర్థి 1.27 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఈ సారి సిట్టింగ్ ఎంపీ నావాస్, అన్నాడీఎంకే అభ్యర్థి పి జయ పెరుమాల్, పన్నీర్సెల్వం మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.