హైదరాబాద్, డిసెంబర్ 16 ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఈ ఏడాది దేశంలో నాలుగు కలవరపెట్టే ఘటనలు జరిగాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ అన్నారు.
‘కాన్స్టిట్యూషన్: చెక్ అండ్ బ్యాలెన్సస్’ పేరిట ఇటీవల నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడిన ఆయన గడిచిన ఏడాది కాలంలో జరిగిన నాలుగు కీలక పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
బీబీసీపై ఐటీ దాడులు: 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీపై ఫిబ్రవరిలో ఐటీ దాడులు జరిగాయి. దీనిపై స్పందించిన జస్టిస్ నారీమన్.. ఇది మీడియా హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. స్వతంత్రంగా రిపోర్టింగ్ చేసిన మీడియాను అణచివేసి చంపేస్తే, ఇక ఏదీ మిగలబోదని మండిపడ్డారు.
ఈసీ ప్యానెల్ ఉదంతం: ఎన్నికల కమిషనర్ల నియామకాలను చేపట్టే త్రిసభ్య కమిటీ నుంచి సీజేఐను తొలగించి, ఆ స్థానంలో కేంద్రమంత్రిని తీసుకొస్తూ ఆగస్టులో కేంద్రప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. దీనిపై జస్టిస్ నారీమన్ స్పందిస్తూ.. ఇది దురదృష్టకర పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
కేరళ గవర్నర్ రగడ: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పలు బిల్లులను తన దగ్గరే పెట్టుకోవడాన్ని జస్టిస్ నారీమన్ తప్పుబట్టారు. 23 నెలల పాటు బిల్లులను ఆమోదించకుండాఅలాగే పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 రద్దు తీర్పు: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీనిపై జస్టిస్ నారీమన్ స్పందిస్తూ.. కోర్టు తీర్పు సమాఖ్య స్ఫూర్తిపై తీవ్ర ప్రభావం చూపేలా ఉందన్నారు. ఐదేండ్లు గడిచినప్పటికీ కశ్మీర్లో ప్రజా ప్రభుత్వ స్థాపన జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు.