న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తదుపరి లోక్పాల్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఎంపికైనట్టు సమాచారం. ప్రధాని మోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నియామకానికి బుధవారం ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్పాల్ అనేది అవినీతి నిరోధక అధికారం కలిగిన స్వతంత్ర న్యాయాధికార (అంబుడ్స్మన్) సంస్థ.
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణల్ని విచారించే అధికారం లోక్పాల్కు ఉంటుంది. 2022 మే నుంచి లోక్పాల్ యాక్టింగ్ చైర్పర్సన్గా జార్ఖండ్ హైకోర్టు మాజీ సీజే ప్రదీప్ కుమార్ మొహంతి వ్యవహరిస్తున్నారు. 2022, జూలై 29న సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ పదవీ విరమణ పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనాలు.. పలు కీలక కేసుల్లో తీర్పులు వెలువరించాయి. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి క్లిన్చిట్ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో రిటైర్ అవుతారనగా..‘పీఎంఎల్ఏ’ చట్టంలోని కఠిన నిబంధనల్ని జస్టిస్ ఖాన్విల్కర్ ధర్మాసనం సమర్థించింది.