న్యూఢిల్లీ : కృత్రిమ చర్యలతో రూపాయికి మద్దతు ఇవ్వడానికి బదులు, దాని విలువను క్రమంగా క్షీణించనివ్వాలని 16వ ఆర్థిక సంఘం చైర్మన్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సూచించారు. రూపాయి విలువ చారిత్రక కనిష్ట స్థాయికి చేరువవుతున్న తరుణంలో, ఒక సంవత్సర ఫార్వర్డ్ రేటు స్వల్పంగా డాలర్కు రూ.100 మార్కును దాటిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డాలర్ బాండ్లు లేదా అధిక వడ్డీతో కూడిన ఎన్ఆర్ఐ డిపాజిట్లను తాత్కాలిక పరిష్కారాలుగా ఉపయోగించవచ్చదని పనగారియా హెచ్చరించారు. ఇవి కేవలం సంపన్న ప్రవాస భారతీయులకు ప్రయోజనం చేకూర్చే ఖరీదైన తాత్కాలిక చర్యల ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పనగారియా వరుస పోస్టుల ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘100 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అని పేర్కొంటూ, రూ.100తో యూఎస్ డాలర్ను పోల్చడమనే మానసిక అవరోధాన్ని అనుసరించి ద్రవ్య విధాన నిర్ణయాలను తీసుకోవద్దని విధాన నిర్ణేతలను హెచ్చరించారు. విదేశీ పెట్టుబడిదారులు చౌకగా లభించే భారతీయ ఆస్తులను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపినప్పుడు అది మళ్లీ పుంజుకుంటుందని ఆయన వాదించారు. ఒకవేళ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే కరెన్సీని కాపాడుకొనేందుకు ప్రయత్నించడం వల్ల నిల్వలు కరిగిపోతాయే తప్ప అసలు సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు.