బెంగళూరు, మార్చి 25: మైనింగ్ కింగ్గా పేరుగాంచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరారు. బెంగళూరులో సోమవారం మాజీ సీఎం యెడియూరప్ప, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గాలి జనార్ధన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మీ, పలువురు కుటుంబసభ్యులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను స్థాపించిన కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష(కేఆర్పీపీ) పార్టీని కూడా జనార్ధన్రెడ్డి బీజేపీలో విలీనం చేశారు. బీజేపీలో చేరిక అనంతరం గాలి మాట్లాడుతూ సొంత ఇంటికి తిరిగి వచ్చినట్టు ఉందన్నారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. కాగా, గతంలో బీజేపీలో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి.. బీఎస్ యెడియూరప్ప క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. మైనింగ్ కుంభకోణం కేసులో ఆయన జైలు పాలయ్యారు.