బెంగళూరు, మార్చి 15: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తన కుమార్తెపై 81 ఏండ్ల యెడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 17 ఏండ్ల బాలిక తల్లి సదాశివనగర్ పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన యెడియూరప్ప దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. దీనిపై హోంమంత్రి జి పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘ఫిర్యాదు ఇచ్చిన మహిళ మానసిక స్థితి సరిగా లేదని కొందరు అంటున్నారు.
ఫిబ్రవరిలో ఆ మహిళ, ఆమె కుమార్తె యెడియూరప్ప ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని ఆ మహిళ ఆరోపిస్తున్నది’ అని పేర్కొన్నారు. కాగా, కేసును తదుపరి దర్యాప్తు కోసం సదాశివనగర్ పోలీస్ స్టేషన్ నుంచి సీఐడీకి బదిలీ చేస్తూ డీజీపీ అలోక్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.ఆ మహిళ తనను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించినా తాను అనుమతించలేదని యెడియూరప్ప చెప్పారు. ఒకసారి ఏడుస్తుండగా, ఆమెను లోపలికి పిలిచామని, తర్వాత పోలీస్ కమిషనర్ సదానంద్తో ఆమె సమస్యను చూడమని చెప్పానన్నారు. అయితే తన ఎదురుగానే తనకు వ్యతిరేకంగా మాట్లాడటం చూసి ఆమె ఏదో తేడాగా ఉందని గ్రహించానన్నారు. బాలిక తల్లి గతంలో అప్పటి బెంగళూరు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్, అతని సిబ్బంది సహా పలువురిపై 50కు పైగా ఫిర్యాదులు చేసినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.