Smartphone | న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్లు వచ్చాక ప్రపంచ జీవన గమనమే మారిపోయింది. అరచేతిలో ప్రపంచంతో అద్భుతాలు ఆవిష్కరించింది. ఎవరు ఎన్ని చెప్పినా ఇది కాదనలేని నిజం. కానీ, మంచి వెంటే చెడు ఉన్నట్టు స్మార్ట్ఫోన్ల వినియోగం తర్వాత అనారోగ్య సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు పిల్లల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. అన్నం తినడం లేదనో, మారాం చేస్తున్నాడనో చేతికిచ్చే ఫోన్లు చిన్నారులను వాటికి బానిసలుగా మారుస్తున్నాయి. గేమ్స్ ఆడడం, వయసుకు మించిన షోలు చూడడం, సోషల్ మీడియాలో వచ్చే అడ్డమైన కంటెంట్ వారిని ఆకర్షిస్తూ అందులోంచి తలెత్తకుండా చేస్తున్నాయి. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, తల్లిదండ్రులు అప్రమత్తమై వారిని రక్షించుకోవాలంటూ చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ ఇండియా మాజీ హెడ్ మనుకుమార్ జైన్ హెచ్చరించారు. పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడం మానాలని ‘లింక్డిన్’ పోస్టు ద్వారా తల్లిదండ్రులను కోరారు.
తన స్నేహితుడు పంపాడంటూ ‘సపీన్ ల్యాబ్’ నివేదిక గురించి ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు. చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్ యాక్సెస్ వల్ల పెద్దయ్యాక మానసిక రుగ్మతులు వేధిస్తాయన్నది ఆ నివేదిక సారాంశమని పేర్కొన్నారు. నివేదికలోని విషయాలు షాక్కు గురిచేస్తున్నాయన్న మనుకుమార్ జైన్.. పదేండ్ల వయసుకు ముందే స్మార్ట్ఫోన్ల వాడకం మొదలుపెట్టిన 60-70 శాతం మంది మహిళలు పెద్దయ్యాక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు తేలిందని, పురుషులు కూడా ఇందుకు భిన్నమేమీ కాదని పేర్కొన్నారు. 45-50 శాతం పురుషులు కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నట్టు ఆయన వివరించారు. తల్లిదండ్రులు ఇప్పటికైనా మేలుకోవాలని, పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడం మాని ఇతర విషయాలపైకి వారి మనసును మళ్లించాలని సూచించారు. నిజ ప్రపంచంలో జీవించడం, బాహ్యకార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం, అలవాట్లను ప్రోత్సహించడం వంటివి చేయాలని కోరారు. ఇలాంటి పనులు వారి ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఆరోగ్యకరమైన జీవితానికి పునాది వేయాలని నొక్కి చెప్పారు. స్మార్ట్ఫోన్లు పిల్లల్ని చెడగొట్టేస్తున్నాయని చెబుతున్నంత మాత్రాన తాను దానికి వ్యతిరేకం కాదని జైన్ స్పష్టం చేశారు.