Satyapal Malik Fire | మేఘాలయ గవర్నర్గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ మాలిక్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల ధరలు పెరుగుతాయని చెప్పి.. ఇంతకు ముందే పానిపట్లో అదానీ కోసం గోదాంలు నిర్మించారని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర లభించలేదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యమం ముగిసినప్పుడు రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నది. కానీ అప్పట్లో ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదని విమర్శించారు.
ఉద్యమం సమయంలో రైతులపై దాఖలైన కేసులు మూతపడలేదని, అదే సమయంలో రైతులకు కనీస మద్దతు ధర కూడా అందలేదని సత్యపాల్ మాలిక్ విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కనీస మద్దతు ధర చట్టం హామీ గురించి మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. రైతుల ఆదాయం పెంపుదల గురించి మాట్లాడినా నేటికీ ఏమీ చేయలేకపోయారన్నారు. తాను గవర్నర్గా ఉన్నప్పుడు తనపై చాలా ఒత్తిడి ఉండేదని, అయితే ఆ ఒత్తిళ్లకు తాను అంగీకరించలేదని స్పష్టం చేశారు.
బుధవారం జైపూర్కు వెళ్తుండగా ఢిల్లీ-జైపూర్ హైవేపై రెవారీలోని బవాల్ పట్టణంలో కొద్దిసేపు ఆగారు. అహిర్ రెజిమెంట్ గురించి సత్యపాల్ మాలిక్ బహిరంగంగా మాట్లాడుతూ.. చాలా కాలం క్రితమే ఆహిర్ రెజిమెంట్ ఏర్పడి ఉండాల్సిందని అన్నారు. అహిర్స్ అద్భుతమైన చరిత్రను ఎవ్వరూ దాచలేరని చెప్పారు. కోస్లి గ్రామ ప్రజలు సైనికులుగా ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. హర్యానాలో కులతత్వం అనే విషం చిమ్ముతున్నారని, ఇది ఎంతో బాధాకరమన్నారు. రైతులు అవకాశం వచ్చినప్పుడు సంఘాలుగా విడిపోకుండా హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.