నాగ్పూర్, మార్చి 5: మావోయిస్టులతో సంబంధాల కేసులో పదేండ్ల క్రితం అరెస్టయిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. సాయిబాబాపై మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు చూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తెలిపింది. 54 ఏండ్ల సాయిబాబాకు విధించిన జీవిత ఖైదును కూడా కోర్టు పక్కన పెట్టింది.
సాయిబాబాతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎన్ఏ మెనెజెస్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. యూఏపీఏ కింద నిందితులను ప్రాసిక్యూట్ చేయటానికి పొందిన అనుమతి చట్టవిరుద్ధమైనదని, ఇది సరైంది కాదని, అందువల్ల ఆ అనుమతి అర్థంలేనిదని ధర్మాసనం పేర్కొన్నది. శారీరక వైకల్యం వల్ల వీల్చైర్కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా 2014లో ఈ కేసులో అరెస్టయ్యారు. అప్పటి నుంచి నాగ్పూర్ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పదేండ్ల సుదీర్ఘ న్యాయపోరాటం ఫలించిందని సాయిబాబా భార్య వసంతకుమారి తెలిపారు. పోరాట సమయంలో తన భర్తకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నేటి కోర్టు తీర్పు తమకు ఎంతో ఉపశమనం కలిగించిందని చెప్పారు. కానీ ఏం జరుగుతుందోనన్న ఆందోళన మాత్రం అలాగే ఉండిపోయిందన్నారు. 2022లో కూడా సాయిబాబా నిర్దోషిగా ప్రకటించారు. కానీ ఆ నిర్ణయాన్ని తిరిగి సవాల్ చేశారు. ఇప్పుడు కూడా అలాంటిది జరగవచ్చని తాము ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. కాగా, సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షిస్తున్నదని, ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.