న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతున్నది. దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు, మరణాలు రెండు వేలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లోని ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు ఇంట్లోనే ఐసొలేషన్ ఉంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా బారిన పడినవారికి తమ వంతు సహాయం అందించేందుకు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారితోపాటు ఇతరులు ఇందులో ఉన్నారు. తమ ప్రాంతాల పరిధిలోని కరోనా సోకిన వారికి సహాయం అందిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
హైదరాబాద్కు చెందిన లా స్టూడెంట్ రిఖిత్ షాహి తన సేవలతో నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాను ఉండే ఖైరతాబాద్ పరిసరాల్లో కరోనా సోకి ఐసొలేషన్లో ఉన్న వారికి ఎలాంటి అవసరాన్ని అయినా తీరుస్తానని ట్విట్టర్లో శుక్రవారం పోస్ట్ చేశారు. మందులు, నిత్యవసరాలు, ఆహారం ఏది కావాలన్నా తనను కాంటాక్ట్ చేస్తే వారి ఇంటి వద్దకు తీసుకువచ్చి ఇస్తానని అందులో పేర్కొన్నారు.
ఢిల్లీకి చెందిన అజాజ్ లోనే, కర్ణిక, అభిషేక్ వంటి వారు కూడా తమ ప్రాంతాల పరిధిలోని కరోనా రోగులకు సేవలందించేందుకు ముందుకు వచ్చారు. అవసరమైతే వండిన ఆహారాన్ని కూడా వారి ఇంటి వద్దకు తెచ్చి ఇస్తామని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరు కరోనా నుంచి కోలుకున్నవారు కూడా ఉన్నారు. ఆ సమయంలో తాము పడిన ఇబ్బందులు, బాధ గురించి తమకు బాగా తెలుసని, అందుకే కరోనా సోకిన వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని అంటున్నారు.