ముంబై, సెప్టెంబర్ 4: టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతోపాటు మరో వ్యక్తి మృతి చెందారు. కారులో మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా మధ్యాహ్నం దాదాపు 3.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు సూర్య నది వంతెనపై డివైడర్ను ఢీకొనడంతో ఆయనతోపాటు వెంట ఉన్న జహంగీర్ పండోల్ అనే మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్టు పాల్ఘర్ జిల్లా ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్ వెల్లడించారు.
కారు డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారని, చికిత్స నిమిత్తం వారిని గుజరాత్లోని దవాఖానకు తరలించామని వివరించారు. మిస్త్రీ, జహంగీర్ పండోల్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాసా రూరల్ హాస్పిటల్కు తరలించినట్టు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డీజీపీని ఆదేశించినట్టు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. మిస్త్రీ మరణం ఎంతో వేదన కలిగించిందని ట్వీట్ చేశారు.
వాణిజ్య రంగానికి తీరని లోటు
సైరస్ మిస్త్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం వాణిజ్య, పారిశ్రామిక రంగానికి పెద్ద లోటని పేర్కొన్నారు. మిస్త్రీ కుటుంబసభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సైరస్ మిస్త్రీ అకాలమరణం దిగ్భ్రాంతి కలిగించింది. దేశ ఆర్థిక సామర్థ్యంపై అపార విశ్వాసమున్న మిస్త్రీ ఓ గొప్ప వ్యాపారవేత్త’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఆత్మీయ మిత్రుడిని కోల్పోయా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణంపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘షాక్కు గురయ్యా. ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయా. సైరస్ మిస్త్రీ ఎంతో వినయం, గౌరవ మర్యాదలతో కూడిన మంచి మనషుల్లో ఒకరు. ఎనిమిదేళ్లకు పైగా నాకు మంచి స్నేహితుడు. సైరస్ మిస్త్రీ ఇక లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్ చేశారు.