కోల్కతా: అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రిపున్ బోరా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సుస్మితా దేవ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అభిషేక్ బెనర్జీ ఈ విషయాన్ని ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఈ రోజు టీఎంసీ కుటుంబంలో చేరిన దృఢమైన, నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు రిపున్ బోరాకు సాదర స్వాగతం’ అని పేర్కొన్నారు. మీరు మాతో కలిసి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నామని, ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని తెలిపారు.
కాగా, టీఎంసీలో చేరే ముందు కాంగ్రెస్ పార్టీకి రిపున్ బోరా రాజీనామా చేశారు. సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు. బీజేపీతో పోరాడటం బదులుగా కాంగ్రెస్ నేతలు తమ ప్రయోజనాల కోసం ఒకరిపై మరొకరు పోట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. మతతత్వ, విభజన శక్తికి చిహ్నంగా బీజేపీని విమర్శించిన ఆయన ఆ పార్టీ ఎదుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా దాని అభివృద్ధి… ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకికవాదం, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పుగా పేర్కొన్నారు. అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన రిపున్, గతంలో ఆ రాష్ట్ర విద్యా మంత్రిగా, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.