న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి(Lt Gen NS Raja Subramani)ని.. తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమించారు. త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం మే 30వ తేదీన ముగియనున్నది. ఆయన స్థానంలో సుబ్రమణి బాధ్యతలు స్వీకరిస్తారు. మిలిటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా ఎన్ఎస్ రాజా సుబ్రమణి బాధ్యతలను పోషించనున్నట్లు రక్షణ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్ సెక్రటేరియేట్లో లెఫ్టినెంట్ జనరల్ సుబ్రమణి మిలిటరీ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. 2024 జూలై 1 నుంచి 2025 జూలై 31 వరకు ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా చేశారు. భారతీయ ఆర్మీలో సుబ్రమణి 39 ఏళ్లు సేవలందించారు. సెంట్రల్ కమాండ్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ కూడా చేశారు. పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెల్, సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ ఆయన అందుకున్నారు.
1985 డిసెంబర్ 14వ తేదీన ఘర్వాల్ రైఫిల్స్కు చెందిన 8వ బెటాలియన్లో కమిషన్ అయ్యారు. ఆ తర్వాత అనేక యుద్ధాల్లో ఆయన సేవలందించారు. ఆర్మీలో నాలుగు దశాబ్ధాల పాటు వివిధ రకాల ప్రదేశాల్లో ఆయన పనిచేశారు. అస్సాంలో చేపట్టిన ఆపరేషన్ రైనోలో కీలక పాత్ర పోషించారు. 16 ఘర్వాల్ రైఫిల్స్ కమాండర్గా చేశారు. జమ్మూకశ్మీర్లో 168 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్గా చేశారు. సెంట్రల్ సెక్టార్లో 17వ మౌంటేన్ డివిజన్లో చేశారు. వెస్ట్రన్ ఫ్రంట్లో ఉన్న ఆర్మీకి చెందిన రెండు కీలక కార్ప్స్ దళాలకు ఆయన కమాండర్గా చేశారు.