పాట్నా : లోన్ కట్టలేదని వాహన యజమానిపైకి రికవరీ ఏజెంట్ల పేరిట కండబలమున్న మనుషుల్ని పంపి.. వాహనాన్ని బలవంతంగా లాక్కెళ్లితే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పాట్నా హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. కండబలమున్న మనుషుల్ని పంపి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల తీరును ధర్మాసనం తప్పుబట్టింది. సదరు పౌరుడి జీవించే హక్కు, జీవనోపాధిని కాలరాయటంగా పేర్కొంది. లోన్ రికవరీ రాజ్యాంగ పరిధిలో, చట్ట ప్రకారం వ్యవహరించాలని తెలిపింది. ఉల్లంఘిస్తే బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.