బెంగళూరు: డ్రగ్స్ తీసుకోవడంతోపాటు అక్రమంగా రవాణా చేస్తున్న 9 మంది వైద్యులు, వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరి నుంచి రెండు కేజీల డ్రగ్స్, మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. భారత సంతతి బ్రిటన్ పౌరుడు నీల్ కిషోరిలాల్, 2006-07 మధ్య కాలంలో మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో డెంటల్ కోర్సు (బీడీఎస్) చదివాడు. 15 ఏళ్లుగా మంగళూరులో ఉంటున్న అతడు డెంటల్ కాలేజీకి చెందిన వైద్యులతోపాటు వైద్య విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న మంగళూరు పోలీసులు, సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు బుధవారం సంయుక్తంగా రైడ్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నీల్ కిషోరిలాల్ను పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న రూ.50,000 విలువైన రెండు కేజీల డ్రగ్స్, మొబైల్ ఫోన్లు, రూ.7,000 నగదు, ఒక బొమ్మ పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 9 మంది వైద్యులు, వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. 22-32 ఏళ్ల మధ్య వయస్సున్న వారిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు మంగళూరు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు.