జైపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మంది సంస్కృతంలో ప్రమాణం చేశారు. (Oath In Sanskrit) ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను స్పీకర్ సత్కరించనున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. సుమారు 21 మంది శాసన సభ్యులు సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను శుక్రవారం సత్కరించనున్నారు. సంస్కృత భారతి జైపూర్ ప్రాంత కార్యదర్శి కృష్ణకుమార్ కుమావత్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రాచీన భాషలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు సంస్కృత పరిరక్షణకు సహకరించారని, రాజస్థాన్కు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.
కాగా, కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం, సంస్కృత భారతి, భారతి మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆవరణలో సన్మాన సభ నిర్వహించనున్నట్లు కృష్ణకుమార్ తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నానీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన 21 మంది ఎమ్మెల్యేలను ఆయన సత్కరిస్తారని అన్నారు. సంస్కృత విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని వెల్లడించారు.