న్యూఢిల్లీ: నాయకత్వ సమస్యతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి దాని మిత్రపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఏ ప్రతిపక్ష పార్టీ ఎదుర్కోలేదని మంగళవారం స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా విపక్ష పార్టీలు బీజేపీని ఢీకొంటాయన్న అంచనాలు అనూహ్యం అని తేల్చేశారు. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 200 స్థానాల్లో నేరుగా బీజేపీతో తల పడుతున్నదని ఓ ఆంగ్ల టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలతో కూటమి కట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి పునాది ఉందని తేజస్వి యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా మారితేనే ఏ విపక్ష కూటమినైనా ఏర్పాటు చేయడం సాధ్యం అవుతుందన్నారు.
అయితే, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల విపక్ష కూటమికి ఆ పార్టీలు ఆయా ప్రాంతాల్లో సారధ్యం వహించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను సంఘటిత పరిచేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలన్నారు. ఇప్పటికే సమయం మించి పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా రాజీ పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. విపక్ష పార్టీల నేతలు సమావేశమై కూటమి నేతను ఎంచుకుంటే మరింత మద్దతు లభిస్తుందన్నారు.
ఇటీవల విపక్ష నేతలతో సమావేశమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయలేమన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం శివసేన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ కాంగ్రెస్ లేకుండా ఏ కూటమి విజయం సాధించలేదన్నారు.