రాంచీ: సరనా మతం (Sarna Religion) గుర్తింపు కోసం గిరిజన సంఘాలు మళ్లీ పోరుబాట పట్టాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. సరనా మతాన్ని గుర్తించాలని ఆదివాసీ సెంగెల్ అభియాన్ (ఏఎస్ఏ) చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నది. దేశంలోని 15 కోట్ల మంది గిరిజనులు సరనా మతాన్ని ఆచరిస్తున్నారని ఏఎస్ఏ అధ్యక్షుడు సల్ఖాన్ ముర్ము తెలిపారు. 1951 జనాభా గణనలో సరనా మతానికి ప్రత్యేక కోడ్ ఉందని చెప్పారు. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆ మతం కోడ్ను తొలగించిందని ఆరోపించారు. ప్రస్తుతం గిరిజనులను వనవాసీలు, హిందువులుగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. గిరిజన సమాజానికి చెందిన మతానికి గుర్తింపును నిరాకరించడం రాజ్యాంగ నేరంతో సమానమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ గిరిజనుల మత స్వేచ్ఛను హరిస్తున్నాయని ఆరోపించారు.
కాగా, సరనా మతాన్ని ఆచరించే గిరిజనులకు స్వతంత్ర వర్గాన్ని కేటాయించాలని షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్టీ) సూచించిందని సల్ఖాన్ ముర్ము తెలిపారు. ఈ నేపథ్యంలో సరనా మతాన్ని గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ మతాన్ని ఏ పార్టీ గుర్తిస్తుందో ఆ పార్టీకే తాము ఓటు వేస్తామని అన్నారు.
మరోవైపు పర్వతాలు, అడవులు, వన్యప్రాణుల వంటి సహజ అంశాలను ప్రధానంగా ఆరాధించే గిరిజన వర్గాల స్థానిక మత విశ్వాసమే సరనా. అనేక గిరిజన సంస్థలు, క్రిస్టియన్ మిషనరీలు సాతానిజం కోసం ప్రత్యేక జనాభా గణన కోడ్ను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనాభా గణనలో సరనాను ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతూ జార్ఖండ్ అసెంబ్లీ 2020 నవంబర్లో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.