న్యూఢిల్లీ: కీలకమైన వ్యవసాయ శాఖకు మధ్యంతర బడ్జెట్లో రూ.1.27 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. వ్యవసాయ రంగంలో పంట కోత అనంతరం జరిగే సేకరణ, నిల్వ, సమర్థ సరఫరా వ్యవస్థ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి కార్యకలాపాల్లో పబ్లిక్, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. నానో యూరియా విధానం విజయవంతమైన నేపథ్యంలో నానో డీఏపీని(ద్రవరూపం) అన్ని అగ్రో-క్లైమేటిక్ జోన్లకు విస్తరిస్తామన్నారు. పాడి రైతులను అదుకొనేందుకు, డెయిరీ రంగం అభివృద్దికి సమగ్రమైన కార్యచరణ రూపొందిస్తామని, అదేవిధంగా సమీకృత అక్వాపార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా వంట నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు ‘ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్’ వ్యూహాన్ని రూపొందిస్తామని వెల్లడించారు.
పీఎం కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందుకొంటున్నారని సీతారామన్ తెలిపారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంట బీమా కల్పించామన్నారు. కాగా, పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని లోక్సభ ఎన్నికల ముందుట కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచుతుందని అంచనా వేసినప్పటికీ, ఆ దిశగా సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే పంట రుణాల మంజూరు లక్ష్యాన్ని పెంచుతారని ఆశించినా, బడ్జెట్లో అలాంటి చర్యలేమీ లేవు.