లక్నో: నకిలీ వీసాతో భారత్లోకి ప్రవేశించిన అమెరికా జాతీయుడికి ఉత్తరప్రదేశ్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష, రూ.20,000 జరిమానా విధించింది. (US National Jailed) జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. అమెరికా జాతీయుడైన 36 ఏళ్ల ఎరిక్ డేనియల్ బెక్విత్, ఈ ఏడాది మార్చి 29న నేపాల్ నుంచి భారత్లోకి ప్రవేశించాడు. నేపాల్, భారత్ సరిహద్దు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లా సోనౌలీలో ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు అతడి పత్రాలను తనిఖీ చేశారు. నకిలీ వీసా ఉన్నట్లు గుర్తించడంతో మహారాజ్గంజ్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్లు, ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ 14 కింద కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం భారత్లోని అమెరికా ఎంబసీకి, నిఘా వర్గాలకు సమాచారం అందించారు.
కాగా, ఈ కేసుపై విచారణ జరిపిన మహారాజ్గంజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సౌరభ్ శ్రీవాస్తవ శుక్రవారం తీర్పు వెల్లడించారు. నకిలీ వీసాతో భారత్లోకి ప్రవేశించిన అమెరికా జాతీయుడు ఎరిక్ డేనియల్ బెక్విత్కు రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.20,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే అదనంగా 15 రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. మహారాజ్గంజ్ ఏఎస్పీ అతిష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు.