భోపాల్: సొంత పార్టీ అభ్యర్థులపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 39 మంది నేతలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. (Congress Leaders Expelled) వారి ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేసింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్నాథ్ ఆదేశాల మేరకు 39 మంది నేతలను కాంగ్రెస్ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించిన వారిలో మాజీ ఎంపీ ప్రేమ్చంద్ గుడ్డు (అలోట్), మాజీ ఎమ్మెల్యే అంతర్ సింగ్ దర్బార్ (మోవ్), మాజీ ఎమ్మెల్యే యద్వేంద్ర సింగ్ (నాగోడ్), రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అజయ్ సింగ్ యాదవ్ (ఖర్గాపూర్), నాసిర్ ఇస్లాం ( భోపాల్ నార్త్), అమీర్ అక్వీల్ (భోపాల్ నార్త్) వంటి వారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన వీరిలో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండగా మరి కొందరు బీఎస్పీ, ఎస్పీ, ఆప్ నుంచి టిక్కెట్లు పొంది ఎన్నికల బరిలో నిలిచారు. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.