తిరువనంతపురం: కాలేజీలో కలుషిత నీటి సరఫరా గురించి ఫిర్యాదు చేసేందుకు కొందరు విద్యార్థులు ప్రిన్సిపాల్ గదికి వెళ్లారు. అయితే ఆ విద్యార్థులను ఆ గదిలో నిర్బంధించారు. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ కాలేజీకి సరఫరా అవుతున్న తాగునీరు మురికిగా ఉండటంపై కొందరు విద్యార్థులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ రమను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ గదిలో ఉన్న ఆ విద్యార్థులను కాలేజీ సిబ్బంది అక్కడ నిర్బంధించారు. కొంత సేపటి తర్వాత ఆ విద్యార్థులను విడిచి పెట్టారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాల్ తీరును విమర్శించారు. కలుషిత తాగునీటి గురించి ఫిర్యాదు చేసిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఛాంబర్లో బంధించడంపై మండిపడ్డారు. ప్రిన్సిపాల్ రమ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆమె గదికి వెళ్లి అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. అలాగే విద్యార్థులను ప్రిన్సిపాల్ గదిలో బంధించిన సంఘటనపై మానవ హక్కుల కమిషన్తోపాటు, ఉన్నత విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.