Foetus inside foetus | మహారాష్ట్ర (Maharashtra)లో అరుదైన ఘటన వెలుగుచూసింది. ఓ గర్భిణి కడుపులో (Pregnant woman) ఉన్న శిశువు పొట్టలో పిండం (Foetus inside foetus) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. స్కానింగ్లో ఈ విషయం బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. బుల్దానా (Buldhana) జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఆమె జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో నెలలు నిండటంతో ఆమెకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. సోనోగ్రఫీ (sonography) చేశారు. ఈ పరీక్షల్లో గర్భస్థ శిశువు కడుపులో పిండం ఉన్నట్లు బయటపడింది. దీన్ని ‘ఫీటస్ ఇన్ ఫీటూ’గా పిలుస్తారని వైద్యులు తెలిపారు.
గతంలో చేసిన ఏ ఒక్క స్కానింగ్లోనూ ఈ విషయం బయటపడలేదని గర్భిణికి నెలనెలా పరీక్షలు చేస్తున్న గైనకాలజిస్ట్ ప్రసాద్ అగర్వాల్ (Dr. Prasad Agarwal) తెలిపారు. తొమ్మిదో నెల కావడంతో చేసిన సోనోగ్రఫీ స్కానింగ్లో ఈ విషయం బయటపడినట్లు వెల్లడించారు. తల్లి గర్భంలో కవలలు ఏర్పడే క్రమంలో అడ్డంకులు కలిగి ఇలాంటివి జరుగుతుంటాయని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు ప్రత్యేక సంరక్షణ అవసరం ఉంటుందన్నారు. కాగా, ఇలాంటి అరుదైన కేసులు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 200 మాత్రమే నమోదయ్యాయి. అందులో భారత్లో 15 – 20 కేసులు వెలుగుచూసినట్లు వైద్యులు వెల్లడించారు.