న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సాదాసీదాగా ఉంది. బడ్జెట్ ప్రసంగం సైతం చప్పగా ఉందని పలువురు పెదవివిరుస్తుండగా మిల్లెట్స్ ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో తృణధాన్యాలపై అవగాహన పెంచేందుకు మాత్రం చొరవ చూపారు.
జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు. అరికలు, కొర్రలు వంటి మిల్లెట్స్ దిగుబడిలో భారత్ ముందువరసలో ఉండగా మిల్లెట్స్లో భారత్ రెండవ అతిపెద్ద ఎగుమతిదారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారత్ మిల్లెట్స్లో గ్లోబల్ హబ్గా ఎదిగిందని, మిల్లెట్స్ ప్రోత్సాహానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ శ్రీ అన్న రీసెర్చ్ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు.
ఇక మిల్లెట్స్తో ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే మిల్లెట్స్ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహ నియంత్రణతో పాటు గ్లూటెన్తో వచ్చే అలర్జీలకు చెక్ పెట్టడం, ఆస్త్మా, వాపులను నివారించడం, జీర్ణశక్తి మెరుగుదల, రోగనిరోధక శక్తి పెరగడం, హృద్రోగ ముప్పు నుంచి బయటపడటం వంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.