Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2023-24 కేంద్ర బడ్జెట్ను బుధవారం పార్లమెంటుకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పార్లమెంటుకు హాజరయ్యారు. ఆమెకు భారతీయ సంప్రదాయ వస్త్రాలంటే చాలా ఇష్టమనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రేవేశపెట్టే సందర్భాల్లో నిర్మలమ్మ సంప్రదాయ వస్త్రాలనే ధరించారు.
ఈ రోజు కూడా నిర్మలా సీతారామన్ సంప్రదాయమైన చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్ కలిగిన ఎరుపు రంగు చీరను ధరించారు. ఎరుపు రంగు చీరలో బడ్జెట్ ట్యాబ్తో తన టీంతో కలిసి పార్లమెంట్కు వెళ్లారు. టెంపుల్ చీరలను సాధారణంగా నూలు, పట్టు లేదా ఈ రెండిటి మిశ్రమంతో తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుని ధరిస్తారు. నిర్మలమ్మ ధరించిన చీరపై నల్లని రంగు బోర్డర్, ఇంట్రికేట్ గోల్డెన్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కాగా, నిర్మలా సీతారామన్ 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు చేనేత చీరే ధరిస్తూ వస్తున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి.