Nirmala Sitharaman : రాబోయే తరానికి మెరుగైన భారత్ను అందించడమే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ బాధ్యతని కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2047 నాటికి డిజిటల్ మౌలిక సదుపాయాలు సహా తదుపరి తరం సంస్కరణల అమలును లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని చెప్పారు. 2014 నుంచి పలు వ్యవస్ధాగత సంస్కరణలను చేపట్టామని తెలిపారు.
వికసిత్ భారత్ 2047 పేరిట ఫిక్కీ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం సంస్కరణలను ముందుకు తీసుకువెళుతుందని స్పష్టం చేశారు. భారత్ను వికసిత్ భారత్గా ఆవిష్కరించే క్రమంలో ప్రభుత్వానికి పరిశ్రమల నుంచి తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్ తరానికి మెరుగైన భారత్ను అందించేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని చెప్పారు.
రాబోయే రోజుల్లో యువత ఇక్కడే ఉంటూ ఉపాధి పొందేలా స్వయం సమృద్ధి సాధిస్తామని, దేశాన్ని ప్రేమించినా బతకుతెరువు కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్ధితి మున్ముందు తలెత్తదని అన్నారు. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో మెరుగైన డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం నెలకొందని మంత్రి వివరించారు.
Read More :
TS Inter Exams | ఇంటర్ విద్యార్థులకు గమనిక..! పరీక్షకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..!