హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం వారుండగా, 5,02,260 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరంవారు ఉన్నారని తెలిపారు.
సెకండియర్ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్ విద్యార్థులున్నట్టు వెల్లడించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు 1,521 సెంటర్లను అధికారులు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. వీటిలో 880 సెంటర్లను ప్రైవేట్ కాలేజీలుండగా, 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, మరో 234 సెంటర్లను గురుకులాల్లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇక పరీక్షల కోసం 27,900 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారని పేర్కొన్నారు.
అన్ని జిల్లాల్లోనూ అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, సిబ్బందిని పరీక్షల విధుల్లోకి తీసుకొంటున్నట్టు వివరించారు.కలెక్టర్లు, పోలీసు అధికారులు పరీక్షాకేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. సెల్ఫోన్లపై కఠిన ఆంక్షలు విధించారు. మాల్ ప్రాక్ట్రీస్, కాపీయింగ్ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్ -25 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు. ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. విద్యార్థులు తమ హాల్టికెట్లను tsbie.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రశాంతంగా పరీక్షలు రాయండి : ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శృతి ఓజా
విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శృతి ఓజా సూచించారు. పరీక్షల నేపథ్యంలో ఆమె సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అన్నిశాఖలతో సమన్వయం చేసుకుని.. గతానికి భిన్నంగా పరీక్షలు నిర్వహించాలని తాము సంకల్పించినట్టు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, డ్యూయల్డెస్క్ బెంచీలు వంటి వసతులు కల్పించామని తెలిపారు. సమావేశంలో పరీక్షల నియంత్రాణాధికారి (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) జయప్రదా భాయి, పరీక్షల విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది ఏర్పాట్లు
పరీక్షాకేంద్రాలు : 1 ,521
చీఫ్ సూపరింటెండెంట్లు : 1,521
ఇన్విజిలెటర్లు : 27,900
ఫ్లయింగ్ స్కాడ్ : 75
సిట్టింగ్ స్కాడ్ : 200