ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు మహావికాస్ అఘాది కూటమి ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగుర వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యే డిమాండ్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొనసాగే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. వీటన్నింటి వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. అధికారంలో కొనసాగేందుకు ఎంవీఏ కూటమికి మద్దతు ఉందా? లేదా అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఎవరికి మెజారిటీ ఉందో ఫ్లోర్ టెస్ట్ మాత్రమే నిర్ణయిస్తుందన్నారు.
ఎంవీఏ కూటమి సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందన్నారు. ఎమ్మెల్యేలు (శివసేన) ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందని తాను నమ్ముతున్నానన్నారు. మహారాష్ట్రలో తాము ఇలాంటి పరిస్థితిని చాలాసార్లు చూశామని, నా అనుభవంతో సంక్షోభాన్ని నివారిస్తామన్నారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ప్రభుత్వం సజావుగా నడుస్తుందని నేను చెప్పగలనన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో ఉందా? లేదా? అనేది అవసరం లేదని.. విధానాలను అనుసరించినప్పుడు.. ఈ ప్రభుత్వం మెజారిటీలో ఉందని రుజువు అవుతుందని పవార్ అన్నారు.