న్యూఢిల్లీ : ఢిల్లీలోని యమునా నది ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకరస్థాయిలో నది ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యమునా నదికి వరద పోటెత్తినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం యమునా 205.38 మీటర్లకు పైగా ప్రవహిస్తోందని ఢిల్లీ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ తెలిపింది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం 8 గంటలకు 203.86 మీటర్ల వద్ద ప్రవాహం ఉండగా, సాయంత్రం 3 గంటల సమయానికి 205.29 మీటర్లకు చేరిందని ఫ్లడ్ కంట్రోల్ రూం వెల్లడించింది. ఈ వరద 206 మీటర్ల మార్క్కు చేరే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాది జులై 30న ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద 205.59 మీటర్ల మేర యమునా ప్రవహించింది. 2019లో 206.60 మీటర్ల వద్ద ప్రవహించినట్లు ఫ్లడ్ కంట్రోల్ రూం తెలిపింది. 1978లో మొదటిసారిగా యమునా 207.49 మీటర్ల మేర ప్రవహించి రికార్డు సృష్టించింది. 2013లో 207.32 మీటర్లు ప్రవహించింది.
హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో.. లక్ష క్యూసెక్కుల ప్రవాహం యమునాకు కొనసాగుతోంది. దీంతో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండి, సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 34 బోట్లు, మొబైల్ పంపులను సిద్ధంగా ఉంచారు.