న్యూఢిల్లీ, అక్టోబర్ 12: విమానయాన సంస్థలు ఈ నెల 18 నుంచి దేశీయ సర్వీసులను ఎలాంటి పరిమితి లేకుండా పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుపవచ్చని కేంద్రం మంగళవారం ప్రకటించింది. కరోనాకు ముందు నడిపిన సర్వీసుల్లో 85 శాతాన్నే ప్రస్తుతం ఆ సంస్థలు నడుపుతున్నాయి. ప్రయాణికుల డిమాండ్ను సమీక్షించిన అనంతరం సర్వీసుల సంఖ్యపై ఆంక్షలను తొలగించాలని నిర్ణయించినట్టు విమానయాన శాఖ తెలిపింది. కేంద్రం ఆదేశాల మేరకు ఆగస్టు 12-సెప్టెంబర్ 18 మధ్య 72.5 శాతం, జూలై 5-ఆగస్టు 12 మధ్య 65 శాతం, జూన్ 1-జూలై 5 మధ్య 50 శాతం సర్వీసులనే విమానయాన సంస్థలు నడిపాయి. ఇప్పుడు ఆంక్షలను తొలగించడంతో విమాన టికెట్ల రేట్లు దిగివస్తాయని భావిస్తున్నారు.
ఎంపీలకు ప్రొటోకాల్ పాటించాలి
విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: విమానయానం చేసే పార్లమెంట్ సభ్యుల (ఎంపీలకు) విషయంలో పాటించాల్సిన నియమాలు, అందించాల్సిన ప్రత్యేక సేవలకు సంబంధించిన మార్గదర్శకాలను పౌరవిమానయాన శాఖ మంగళవారం విడుదల చేసింది. విమానయాన సంస్థలు, దేశంలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు ఈ నిబంధనలు పాటించాలని సూచించింది. విమానాశ్రయాల్లో సేవల విషయంలో కొందరు ఎంపీలు అసౌకర్యానికి గురవుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది.