Flights Collision | ఒకే రన్ వేపైకి వచ్చి రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన కోల్కతా విమానాశ్రయంలో చోటు చేసుకున్నది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని డీజీసీఏ తెలిపింది. ఒక విమానం చెన్నైకి వెళ్తుండగా.. మరొక విమానం దర్భంగాకు వెళ్తుండగా ఘటన జరిగినట్లుగా పేర్కొంది. ఒకే రన్ వేపైకి వచ్చి ఢీకొట్టుకోవడంతో విమానాల రెక్కలు విరిగిపోయాయి. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో విమానం ఇండిగోకు చెందింది కాగా.. కోల్కతా నుంచి దర్భంగాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ పేర్కొంది. ఘటనపై విచారణకు ఆదేశించింది. అలాగే పైలట్లను విధుల నుంచి తప్పించింది.