ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. చిన్న కారణంతో మొదలైన గొడవ పెద్దదై ఏకంగా ఒక నిండు ప్రాణమే పోయింది. బిడ్డ బెడ్షీట్ తెచ్చివ్వలేదన్న కోపంతో ఓ భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఘజియాబాద్ జిల్లాలోని మసూరి పట్టణంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. షాదాబ్ అనే వ్యక్తి భార్య షబానా (35), ఐదేండ్ల కుమార్తె సబాతో కలిసి మసూరి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి షాదాబ్ కుమార్తె సబాకు బెడ్షీట్ తెమ్మని చెప్పాడు. అయితే ఆటమీద పడిన చిన్నారి తండ్రి చెప్పినమాట వినిపించుకోలేదు. దాంతో కోపోద్రిక్తుడైన షాదాబ్.. భార్య షబానాను కొట్టాడు.
ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో క్షణికావేశంలో కత్తితో ఆమెను పొడిచాడు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అలీ హసన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షాదాబ్ను అరెస్ట్ చేశారు. షబానా భౌతికకాయాన్ని పోస్టుమార్టానికి తరలించారు.