కేంద్రప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడే మంచి మనుషులకు 5 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ఈ నెల 15 నుంచి అమలులోకి వస్తుందని, 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని తెలిపింది. రోడ్డు ప్రమాద బాధితులకి తక్షణ తోడ్పాటు అందించి, వారికి వైద్య సహాయం అందించేందుకు ప్రమాదం జరిగిన గంటలోపు సాధ్యమైనంత త్వరగా దవాఖాన/ట్రామా కేర్ సెంటర్కు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడినవారికి రూ.5 వేల బహుమతి అందిస్తామని పేర్కొంది. అత్యవసర పరిస్థితిలో రోడ్డు ప్రమాద బాధితులను సహాయం అందించేలా సాధారణ ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టామని తెలిపింది. రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతల నుంచి ప్రతి ఏటా జాతీయస్థాయి అవార్డుకు 10 మందిని ఎంపిక చేస్తామని, వారికి రూ.లక్ష చొప్పున అందజేస్తామని తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది బాధితులను ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు కాపాడినప్పుడు… కాపాడిన వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.5 వేలు మించకుండా నగదును పంపిణీ చేస్తామని వివరించింది.