శ్రీనగర్, అక్టోబర్ 12: వరుస ఎన్కౌంటర్లతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతున్నది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులవ్వగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వడం తెలిసిందే.
ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఓ పాకిస్థాన్ ఉగ్రవాదిని సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మహమ్మద్ అష్రఫ్ అలియాస్ అలీగా గుర్తించారు. అతని నుంచి ఏకే-47 రైఫిల్, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన అలీ.. పదేండ్ల క్రితమే దేశంలోకి చొరబడ్డాడని, నకిలీ పత్రాలతో భారత గుర్తింపు కార్డును పొంది ఇక్కడే పెండ్లి కూడా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.