ఐదు రాష్ట్రాల ఎన్నికలు సోమవారంతో ముగిశాయి. చిన్న చిన్న హింసాత్మక ఘటనలు మినహా ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పాల్సి వుంటుంది. యూపీలో సోమవారం నాటికి చివరి దశ పోలింగ్ జరిగింది. దీంతో పోలింగ్కు తెరపడినట్లైంది. జనవరి 8 న కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నిల షెడ్యూల్ను విడుదల చేసింది. ఐదు రాష్ట్రాల్లో 690 సీట్లకు ఎన్నికలు జరిగాయి.
యూపీలో 403 స్థానాలు, మణిపూర్లో 28 స్థానాలు, గోవాలో 40 స్థానాలు, పంజాబ్లో 117 స్థానాలు, ఉత్తరాఖండ్ 70 స్థానాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో మాత్రం ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఇక మణిపూర్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.
యూపీలో త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ముఖ్యంగా బీజేపీ, సమాజ్వాదీ మధ్యే పోటీ నెలకొంది. ఇక.. పంజాబ్లో ఆప్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ లాగే ప్రచారం జరిగింది. గోవాలో కూడా త్రిముఖ పోటీనే నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. ఉత్తరాఖండ్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా గడిచింది.