న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సీఎంగా రేఖా గుప్తాతో పాటు మంత్రులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఏడుగురు మంత్రుల్లో సీఎంతో సహా ఐదుగురిపై క్రిమినల్ కేసులు (criminal cases) నమోదయ్యాయి. మంత్రి ఆశిష్ సూద్పై తీవ్రమైన నేరారోపణలున్నాయి. ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ విషయాన్ని తెలిపింది. వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా దీనిని నిర్ధారించింది.
కాగా, ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ 9వ సీఎంగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలైన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మతోపాటు ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
మరోవైపు ఏడుగురు కేబినెట్ మంత్రుల్లో ఇద్దరు బిలియనీర్లు. రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన మంజీందర్ సింగ్ సిర్సాకు అత్యధికంగా రూ. 248.85 కోట్ల ఆస్తులున్నాయి. కరావాల్ నగర్ నియోజకవర్గానికి చెందిన మంత్రి కపిల్ మిశ్రా అత్యల్పంగా రూ.1.06 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఏడుగురు మంత్రుల సగటు ఆస్తులు రూ. 56.03 కోట్లు.
కాగా, తమకు అప్పులు కూడా ఉన్నట్లు ఏడుగురు మంత్రులు తమ అఫిడవిట్లో ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన న్యూఢిల్లీ నియోజకవర్గానికి చెందిన పర్వేష్ సాహిబ్ సింగ్కు అత్యధికంగా రూ.74.36 కోట్ల అప్పులున్నాయి. మరోవైపు ఏడుగురు మంత్రులలో ఆరుగురు గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి విద్యార్హతలను ప్రకటించారు. ఒక మంత్రి 12వ తరగతి మాత్రమే పూర్తి చేశారు.