Crime news : ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులందరి ఒంటిపై గొడ్డలి గాట్లు ఉన్నాయి. అదే గ్రామానికి ఓ వ్యక్తి ఆ ఇంటి పక్కనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తే ముందుగా ఆ ఐదుగురిని చంపేసి ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరాన్గఢ్-బిలాయ్గఢ్ జిల్లాలోని సలీహా పోలీస్స్టేషన్ పరిధిలోగల తార్గావ్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తార్గావ్ గ్రామంలోని ఓ ఇంట్లో హేమ్లాల్ సాహు (55) అనే వ్యక్తి.. తన భార్య జగ్మోతి సాహు (50), వారి కుమార్తెలు మమతా సాహు (35), మీరా సాహు (30), వారి మనుమడు ఆయుష్ (5), మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం హేమ్లాల్, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు, మనమడు ఇంట్లో విగతజీవులుగా పడివున్నారు. వారి ఇంటికి సమీపంలోనే అదే గ్రామానికి చెందిన మనోజ్ సాహు అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఐదుగురిది అనుమానాస్పద మృతిగా, మనోజ్ సాహుది ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఇంట్లో పడివున్న మృతదేహాలపై గొడ్డలి గాట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పరిస్థితిని చూస్తుంటే ఇంటి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయిన మనోజ్ సాహూనే.. ఆ కుంటుంబంలోని ఐదుగురిని హత్య చేసి, ఆ తర్వాత ఉరేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని, అసలు ఏం జరిగిందనేది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు.