Gas Leakage | మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మృతి చెందారు. సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున కూలీలు కర్మాగారంలో పని చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫ్యాక్టరీని ఖాళీ చేయించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తరలించారు. ఆ ఫ్యాక్టరీ మొరేనా జిల్లాలోని జరేరువా ప్రాంతంలో ఉన్నది.
అయితే, ఫ్యాక్టరీలోని ట్యాంకును శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలు మొదట అందులోకి దిగారని తోటి కార్మికులు తెలిపారు. శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువు లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు కార్మికులు వారిని కాపాడేందుకు ట్యాంకులోకి దిగారు. వారు సైతం విషవాయును పీల్చడంతో మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు సోదరులు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీలో చెర్రీలను చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.