న్యూఢిల్లీ: ద లాన్సెట్ జర్నల్ ఓ కొత్త నివేదికను ప్రచురించింది. 2019లో ఇండియాలో అయిదు రకాల బ్యాక్టీరియాల వల్ల సుమారు 6.8 లక్షల మంది మరణించినట్లు పేర్కొన్నది. ఈ.కొలై, ఎస్.నుమోనియా, కే.నుమోనియా, ఎస్ ఆరియస్, ఏ బౌమని బ్యాక్టీరియాల వల్ల ఆ మరణాలు సంభవించినట్లు ద లాన్సెట్ జర్నల్ తన రిపోర్ట్లో వెల్లడించింది. 2019లో చోటుచేసుకున్న మరణాలకు.. బ్యాక్టీరియాలే రెండవ కారణంగా రిపోర్ట్ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 8 మంది మరణాల్లో ఒకటి బ్యాక్టీరియా వల్లే జరిగినట్లు నివేదిక పేర్కొన్నది. 33 రకాల బ్యాక్టీరియాల వల్ల 2019లో సుమారు 77 లక్షల మంది మరణించినట్లు లాన్సెట్ తెలిపింది.అయితే దీంట్లో కేవలం అయిదు రకాల బ్యాక్టీరియాల వల్లే సగం మంది మరణించిట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రాంతం, వయసును బట్టి కొన్ని బ్యాక్టీరియాలు ప్రాణాంతకంగా మారాయి.
భారత్లో కేవలం ఈ.-కొలై బ్యాక్టీరియా వల్లే 2019లో 1.57 లక్షల మంది చనిపోయినట్లు లాన్సెట్ స్టడీ పేర్కొన్నది. ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు గుండెపోటు వల్ల కాగా, బ్యాక్టీరియాల వల్ల మరణించిన వారి సంఖ్య రెండో స్థానంలో ఉంది.