Varanasi | ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో(Varanasi) పవిత్రమైన గంగానదిలో పడవపై(Boat) చికెన్ వండుతూ, బీరు తాగుతూ పార్టీ చేసుకున్న(Chicken and beer party) ఘటన కలకలం రేపింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన యూపీ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి పడవను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..గంగానదిలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద నిలిపిన ఓ పడవపై ఎనిమిది మంది యువకులు చికెన్ వండుకుంటూ, బీర్ తాగుతూ పార్టీ చేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
ఆ వీడియోపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్ సాహ్ని, అజయ్ సాహ్ని, అనురాగ్ సాహ్ని, దీపక్ కుమార్, అరుణ్ కుమార్ అనే ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. మిగతా ముగ్గురిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కాశీ, వారణాసి వంటి పవిత్రమైన క్షేత్రాల్లో ఇలాంటివి చోటు చేసుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.