కేరళ విజింజమ్లో 50 రోజులుగా నిరసనలు
తిరువనంతపురం, జూలై 28: దేశంలోని సహజ సంపద కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తిన అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా కేరళలోని విజింజమ్ ప్రాంతంలోని వేలాదిమంది స్థానికులు, మత్స్యకారులు 50 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. వందల ఏండ్లుగా సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్న తమనోట్లో పోర్టు పేరిట మట్టి కొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. విజింజమ్ అదానీ పోర్టు నిర్మా ణం పూర్తయితే అరుదైన మత్స్యజాతులు అంతరించి పోతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇదే జరిగితే చేపలను అమ్మి బతికే తమ జీవితాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చేపలతోపాటు, పర్యావరణానికి కూడా ఈ పోర్టు నిర్మాణం హాని కలిగించే ప్రమాదమున్నదన్న మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అధ్యయనాన్ని ఈ సందర్భంగా స్థానికులు గుర్తు చేస్తున్నారు. అదానీ పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా జూన్ 5 నుంచి రోజూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాగా, తిరువనంతపురంలోని విజింజమ్ తీరప్రాంతంలో రూ. 7,525 కోట్లతో పోర్టు నిర్మాణానికి 2015లో అప్పటి యూడీఎఫ్ ప్రభుత్వం అదానీ గ్రూప్నకు అనుమతులు మంజూరుచేసింది. ప్రస్తుతం పోర్టు తొలి దఫా నిర్మాణం పూర్తికావచ్చింది.