లక్నో: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్కు అయోధ్యలో స్వాగత కార్యక్రమం సందర్భంగా చేపల విందు ఏర్పాటు చేశారు. పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ విందు ఏర్పాటును స్థానిక మత పెద్దలు వ్యతిరేకించడంతో వివాదం తలెత్తింది. అయితే ప్రతి వ్యక్తికి తమ ఇష్టానుసారం ఆహారం తినే రాజ్యాంగ హక్కు ఉందని పార్టీ నేత సమర్థించుకున్నారు. (Fish feast at Congress’s Ayodhya event) ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆదివారం అయోధ్యలో పర్యటించారు. శ్రీ రామ్ జన్మభూమి ఆలయాన్ని, హనుమాన్ గర్హిని సందర్శించారు. హనుమాన్ గర్హిలో హనుమాన్ చాలీసా కూడా ఆయన పఠించారు.
కాగా, ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై అజయ్ రాయ్ మండిపడ్డారు. శ్రీరాముని సన్నిధిలో సమర్పించిన కానుకలను అపహరించిందని ఆరోపించారు. ఆలయ సొమ్మును అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సద్బుద్ధి ప్రసాదించాల్సిందిగా హనుమంతుడిని తాను ప్రార్థించినట్లు తెలిపారు. ‘వారిపై చర్యలు తీసుకోవాలి. వారిని జైలుకు పంపాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా అణచివేత, అన్యాయం జరుగుతున్నాయని ఆరోపించారు.
ఆ తర్వాత తరుణ్లో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో అజయ్ రాయ్ పాల్గొన్నారు. ఆ పార్టీలో చేరిన నేపథ్యంలో రామ్ నిహాల్ నిషాద్ ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ విందు కోసం చేపల కూర తయారీకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలో చేపల విందు ఏర్పాటు చేయడంపై కొందరు స్థానిక సాధువులు, ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేత రామ్ నిహాల్ నిషాద్ దీనిని సమర్థించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు నచ్చిన ఆహారాన్ని తినడం అనేది ప్రతి వ్యక్తి హక్కు అని తెలిపారు. చేపలు పట్టడం, చేపలు తినడం తమ సంప్రదాయ ఆచారాలలో భాగమని ఆయన చెప్పారు. శ్రావణ మాసం, భాద్రపద మాసం లేదా మరే ఇతర మాసం అనే ప్రాతిపదికన ఒక వ్యక్తి ఆహార ఎంపికలను ప్రశ్నించకూడదని అన్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన చేపల విందుపై వివాదం చెలరేగడం చర్చనీయాంశమైంది.