Jamili Elections | రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ.. రెండు దశల్లో జమిలి విధానాన్ని అమలు చేయడానికి మొగ్గుచూపుతున్నది. 2029లో 20 రాష్ర్టాల శాసనసభలకు, 2034లో లోక్సభతోపాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఒకే దేశం, ఒకే ఎన్నిక (జమిలి) విధానాన్ని అమలు చేయడానికి దశలవారీ రోడ్మ్యాప్ను పరిశీలిస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా, తరచూ ఎన్నికలు జరుగకుండా నిరోధించేందుకు వీలుగా రెండు దశల నమూనాపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం.. దేశం మొత్తాన్ని ఒకేసారి ఒకే ఎన్నికల చక్రం పరిధిలోకి తీసుకురావడానికి బదులుగా, 2029, 2034లో రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ ప్రతిపాదన ప్రకారం, మొదటి దశలో దాదాపు 20 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో అనుసంధానించవచ్చు.
మిగిలిన రాష్ర్టాలను 2034 నాటికి ఉమ్మడి ఎన్నికల చక్రంలోకి తీసుకురావచ్చు. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన సమకాలీకృత ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేస్తున్న జేపీసీ గడువును 2026 వానకాల సమావేశాల వరకు పొడిగించారు. కమిటీ అప్పటికి తన నివేదికను సమర్పిస్తుందని భావిస్తున్నందున, ఎన్నికల సమకాలీకరణ ప్రక్రియ 2029 నుంచి ప్రారంభం కావచ్చు. కమిటీ 2026 వానకాల సమావేశాల చివరి వారంలోని మొదటి రోజున తన సిఫార్సులను సమర్పించాల్సి ఉన్నది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, నియంత్రణ సంస్థలు, పరిపాలన అధికారులతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించనున్నారు.
నివేదికను సమర్పించిన తర్వాత పార్లమెంటులో ఈ సిఫార్సులపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. తమ విస్తృత సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా జేపీసీ 2025 మే 17-18 తేదీల్లో మహారాష్ట్రను సందర్శించింది. అక్కడ ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీలు, పరిపాలనా అధికారులు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, నియంత్రణ సంస్థలతో చర్చలు జరిపింది. జమిలి ఎన్నికల వల్ల పాలన, పరిపాలన సామర్థ్యం, ప్రభుత్వ వ్యయంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ తర్వాత కమిటీ 2025 మే 19-21 తేదీల్లో ఉత్తరాఖండ్ను సందర్శించి సీఎం పుష్కర్సింగ్ ధామి, రాష్ట్ర అధికారుతో సంప్రదింపులు జరిపింది. గత మూడేండ్లలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల దాదాపు 175 రోజుల పాటు ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడిందని ధామి కమిటీకి తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించడం వల్ల ఎన్నికల సంబంధిత వ్యయం 30-35% వరకు తగ్గుతుందని ఆయన వాదించారు. పర్వత ప్రాంత రాష్ట్రంలో పదేపదే ఎన్నికలు నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లను కూడా సీఎం నొక్కి చెప్పారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, రుతుపవనాల వాతావరణం, ఏటా జరిగే చార్ధామ్ యాత్ర వంటి అంశాలు ఎన్నికల నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
దేశంలో 1952 నుంచి 1967 మధ్య మొదటి నాలుగు సాధారణ ఎన్నికల చక్రాలలో లోక్సభ, చాలా రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించారు. అయితే 1967 తర్వాత పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలు కూలిపోవడంతో ఈ ఉమ్మడి ఎన్నికల చక్రం దెబ్బతిన్నది. 1968, 1969లో పలు అసెంబ్లీలు రద్దయ్యాయి. ఆ తర్వాత 1970లో లోక్సభ కూడా గడువుకన్నా ముందే రద్దయింది. 1971లో జరిగిన ముందస్తు లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత కాలంలో వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన, అసెంబ్లీ ముందస్తు రద్దు వంటి పరిణామాలు ఈ సమకాలీకృత చక్రాన్ని మరింతగా దెబ్బతీశాయి. అప్పటి నుంచి లా కమిషన్, నీతి ఆయోగ్ వంటి సంస్థలు క్రమానుగతంగా ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాలని సిఫార్సు చేస్తూ వస్తున్నాయి. 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఏకకాల ఎన్నికల ప్రతిపాదనకు మరింత ఊపు వచ్చింది. ఈ ప్యానెల్ రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ఎన్నికల అధికారులు, ఇతరులతో సంప్రదింపులు జరిపిన తర్వాత 2024 మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను సమర్పించింది. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ కమిటీ 191 రోజులపాటు సమగ్రంగా అధ్యయనం చేసింది.
నిర్దేశిత దశలవారీ పద్ధతిలో ఏకకాల ఎన్నికలను అమలు చేయడానికి రాజ్యాంగంలో కొన్ని విధానాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. లా కమిషన్ మాజీ సభ్యుడు, మోహన్లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం లా కాలేజీ డీన్ ఆనంద్ పలివాల్ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్స్ను ఒకే తాటిపైకి తెచ్చేందుకు కొన్ని రాష్ర్టాల్లో అసెంబ్లీ గడువు ముగియకముందే ఎన్నికలు నిర్వహించవచ్చని, మరికొన్ని అసెంబ్లీల పదవీకాలాన్ని పొడిగించవచ్చని చెప్పారు. గతంలో కూడా అసాధారణ పరిస్థితుల్లో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాలను మార్చిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. తొలిదశలో 20 రాష్ర్టాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలంటే వివిధ రాష్ర్టాల్లో అసెంబ్లీల గడువు ఎప్పటివరకు ఉన్నదో ముందు అర్థం చేసుకోవాలి.
2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదు. అయితే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం అసెంబ్లీల గడువు ముగుస్తున్నది. ఆయా అసెంబ్లీల కాలాన్ని 5 నెలల నుంచి ఏడాది వరకు పొడిగించాల్సి ఉంటుంది. ఇక బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువు 2030-31లో ముగియనున్నది. వాటి గడువును ఒకటి నుంచి రెండేండ్లు తగ్గించాల్సి వస్తుంది. అయితే, ఇంతటి భారీ సంస్కరణకు పార్లమెంట్ శాసనపరమైన మార్పులు చేయడంతోపాటు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరమవుతుంది.