లక్నో: ఉత్తర ప్రదేశ్లో పదుల సంఖ్యలో పిల్లలు డెంగ్యూతో మరణించడాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్గా తీసుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని బుధవారం ఆదేశించారు. ఫిరోజాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా డెంగ్యూ, వైరల్ జ్వరాలతో 40 మందికిపైగా పిల్లలు చనిపోయారు. ఈ సంఖ్య 44కు చేరుకున్నదని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మనీష్ అసిజా ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన సీఎం యోగి, చిన్నారులకు మంచి వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. దీంతో 15 మంది డాక్టర్ల బృందం లక్నో నుంచి ఫిరోజాబాద్కు చేరుకున్నది. జిల్లా అధికారులతో వైద్యులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్త పరీక్షలు నిర్వహించారు.
కాగా, సోమవారం ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రిని సీఎం యోగి సందర్శించారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ బృందం, ప్రభుత్వ నిఘా బృందంతో పిల్లల మరణాలపై దర్యాప్తు చేయిస్తామన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిరోజాబాద్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ను బుధవారం సస్పెండ్ చేశారు.