లక్నో : ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానలా తయారై.. కాల్పులకు దారి తీసింది. సెక్యూరిటీ గార్డుల కాల్పుల్లో పలువురు విద్యార్థులు గాయపడగా.. విద్యార్థి నేత వివేకానంద్ పాఠక్కు తీవ్ర గాయాలయ్యాయి. యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న బ్యాంకు వద్దకు విద్యార్థి నేత వివేకానంద్ పాఠక్ చేరుకోగా.. గార్డులు గేట్ను తెరిచేందుకు నిరాకరించారని విద్యార్థులు ఆరోపించారు.
ఈ విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శాంతింపజేశారు. ఆ తర్వాత కొంతసేపటికి 200 మందికిపైగా యూనివర్సిటీ గార్డులు గేట్ను మూసివేసి తమపై దాడికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. స్టూడెంట్ నేత పాఠక్, ఎల్ఎల్బీ స్టూడెంట్ సహా ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు యూనివర్సిటీ క్యాంటిన్తో పాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న డీఎం సంజయ్ ఖత్రీ భారీ బలగాలతో క్యాంపస్కు చేరుకొన్నారు. అప్పటికే విద్యార్థులు క్యాంపస్లో రచ్చ సృష్టించగా.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే వివిధ పోలీస్స్టేషన్ల నుంచి సిబ్బందిని క్యాంపస్కు తరలిస్తున్నారు. అలహాబాద్ యూనివర్సిటీ క్యాంపస్తో పాటు పరిసర ప్రాంతాలన్నీ బలగాలతో నిండిపోయాయి.