– ప్రధాని నరేంద్రమోదీపై సమాజ్వాది చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైర్
లక్నో: సమాజ్వాది పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ గురించి ప్రధాని నరేంద్రమోదీ ఎగతాళిగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. సైకిల్ను అవమానిస్తే యావద్భారత జాతిని అవమానించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎస్పీ ఎలక్షన్ సింబల్ అయిన సైకిల్ను ఎగతాళి చేశారు.
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల నిందితులు సైకిళ్లపైనే బాంబులను అమర్చి మారణహోమానికి పాల్పడ్డారని, ఆ సైకిల్ సమాజ్వాది పార్టీ ఎన్నికల గుర్తు అని ప్రధాని వ్యాఖ్యానించారు. దీనిపై అఖిలేష్ స్పందిస్తూ.. సైకిల్ పేదల జీవితాల్లో ఓ అంతర్గత భాగమని, పేదలు తమ రవాణా అవసరాల కోసం ఉపయోగించేది సైకిల్నేనని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
రైతులకు సైకిలే ముఖ్యమైన రవాణా సాధనమని అఖిలేశ్ చెప్పారు. మన ఆడబిడ్డలు స్కూళ్లకు వెళ్లడానికి ఉపయోగించేది సైకిల్నేనని అన్నారు. ఇంధన ధరలు పెరిగినా ప్రభావం పడని వాహనం సైకిల్ మాత్రమేనని చెప్పారు. సైకిల్ గ్రామీణ భారతానికి గర్వకారణమని, సామాన్యుల విమానమని, అలాంటి సైకిల్ను అవమానిస్తే జాతిని అవమానించినట్లేనని ప్రధానికి కౌంటర్ ఇచ్చారు.