పాట్నా, జూలై 24 (నమస్తే తెలంగాణ) : బీహార్లోని సరన్ జిల్లా ఖుదైబాగ్లోని ఓ పటాకుల వ్యాపారి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు మృతిచెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మరో ఎనిమిది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకోగా, వారిని బయటకు తీసేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణసంచా వ్యాపారి షబ్బీర్ హుస్సేన్కు చెందిన ఇంటిలోని ఓ భాగం పేలుడుకు ధ్వంసం కాగా, మరో భాగం మంటల్లో చిక్కుకొన్నది. వ్యాపారి తన ఇంట్లోనే పటాకులు నిల్వచేశారని, గంటపాటు వరుసగా పేలుళ్లు సంభవించాయని ఎస్పీ సంతోష్కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ టీం, బాంబ్ స్కాడ్ బృందాల దర్యాప్తు అనంతరం పేలుడుకు కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.