కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మెడికల్ కాలేజీలోని కొవిడ్ వార్డులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి ఒక రోగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేసింది. మృతురాలిని ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లాకు చెందిన సంధ్య రాయ్(60)గా పోలీసులు గుర్తించారు.
కొవిడ్ వార్డులో మంటలు చెలరేగడంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రికి వచ్చిన వారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన వార్డును రాధరాణి వార్డుగా గుర్తించారు. అయితే కరోనా విజృంభించినప్పటి నుంచి ఈ వార్డును కొవిడ్ వార్డుగా మార్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన వార్డులో ఫోరెన్సిక్ విచారణ జరిపిస్తామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రబీర్ సేన్గుప్తా తెలిపారు.